Latest

భుజ్‌ : ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా .. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో వస్తున్న కొత్త సినిమా. ఇది ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఓ చారిత్రక సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. 1971లో ఇండియా– పాకిస్తాన్‌ యుద్ధం జరుగుతున్నప్పుడు గుజరాతీ మహిళ సుందర్‌బెన్‌ జెఠా మధర్‌పర్యా అనే సాహసవంతురాలు 299 మంది మహిళలతో భారత సైన్యానికి మద్దతుగా నిలిచిన సంఘటనలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ భుజ్‌లోని ఎయిర్‌ బేస్‌పై బాంబులతో దాడి చేసింది. 14 రోజుల పాటు 35 సార్లు దాడిచేసింది. 92 బాంబులు, 22 రాకెట్లను ఈ దాడికి ఉపయోగించింది.

భుజ్‌ కచ్‌ జిల్లాలో ఉంది. భుజ్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్‌ బేస్‌ ఉంది. ఎయిర్‌బేస్‌ ధ్వంసం చేసినప్పుడు మూడు రోజుల్లోనే తిరిగి నిర్మించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ సాహసవంతమైన కార్యాన్ని సుందర్‌బెన్‌ జెఠా ఎలా పూర్తిచేశారు? అందుకు తోటి మహిళలు ఎలా సహకరించారు? ఆమెను భారత ప్రభుత్వం ఎలా సత్కరించింది? వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో సోనాక్షి సిన్హా ధీర వనితగా ముందుకు నడుస్తున్న చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

అజయ్‌ దేవ్‌గన్‌ ఈ చిత్రంలో విజయ్‌ కార్నిక్‌ పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌ కార్నిక్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి. భుజ్ ఎయిర్ బేస్ కు కమాండర్ గా ఉన్నారు. ఈయనే ఈ మూడు వందల మంది మహిళలకు ఎయిర్‌ బేస్‌ పునర్నిర్మాణం చేపట్టేందుకు ప్రేరణ కల్పించారు.

సంజయ్‌దత్, రాణా దగ్గుబాటి, ప్రణితా సుభాష్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ 2019లోనే ప్రారంభమైంది. కరోనా ఎఫెక్ట్‌తో ఆలస్యంగా నిర్మితమవుతోంది.

డిస్నీ హాట్‌స్టార్‌లో భుజ్‌ : ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా

భుజ్‌ మూవీ డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న చిత్రాల జాబితాలో ఇది కూడా చేరింది. ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. అభిషేక్‌ దుధైయ్యా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం ఆరో ప్రవో ముఖర్జీ అందిస్తున్నారు.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version