పూర్ణం బూరెలు రెసిపీ: ఈ సులువైన చిట్కాలతో మీ కుటుంబ సభ్యుల మెప్పు పొందండి

poornam boorelu
పూర్ణం బూరెలు Suman Tech, CC BY-SA 4.0 , via Wikimedia Commons

Poornam Boorelu: ఉగాదికి అంద‌రికీ గుర్తొచ్చే పిండి వంట‌కం పూర్ణం బూరెలు. కాక‌పోతే అందరికీ ఇష్టమైన వీటిని, త‌యారు చేయ‌డం కొందరికి కష్టం. ఇప్పటి తరంలో చాలా మందికి ఈ పూర్ణం బూరెలను తయారు చేయడం రాదు. త‌యారీ విధానం అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు వీటిని ఎంత ప్ర‌య‌త్నించినా చ‌క్క‌గా, రుచిగా త‌యారు చేసుకోలేక పోతుంటారు. ఇక్కడ చెప్పే సులువైన చిట్కాల‌తో పూర్ణం బూరెలు చేసేయండి. కుటుంబ స‌భ్యుల మెప్పు పొందండి. 

పండగలు, శుభకార్యాలు ఏమైనా సరే భోజన ప్రియుల దృష్టి బూరెల వైపే ఉంటుంది. ఇప్ప‌టి వారికి వాటిని త‌యారు చేయ‌టం అంత‌గా తెలియ‌క‌పోయినా, ఒకప్పుడు ఈ పూర్ణం బూరెలు లేకుండా ఎటువంటి పండగ, ఫంక్షన్ పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు ఉగాది సందర్భంగా టేస్టీ టేస్టీ పూర్ణం బూరెల‌ తయారు గురించి తెలుసుకుందాం..

పూర్ణం బూరెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

మినపప్పు – ఒక కప్పు

బియ్యం – పావు కప్పు

శనగపప్పు – ఒక కప్పు

బెల్లం తురుము – ఒక కప్పు

యాలకుల పొడి – అర స్ఫూన్‌

వంట సోడా – పావు స్ఫూన్‌

ఉప్పు- ఒక టీ స్పూన్

నెయ్యి- స్ఫూన్‌

నూనె – వేయించడానికి సరిపడా

నీరు – రెండు కప్పులు

పూర్ణం బూరెల తయారీ విధానం: 

స్టెప్ 1: ముందుగా మినపప్పు , బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి వేర్వేరుగా నానబెట్టాలి. 

స్టెప్ 2: సుమారు ఐదు గంటల త‌రువాత‌ మినపప్పు, బియ్యం వేసి మిక్సీ వేసుకోవాలి. 

స్టెప్ 3: నీరు పోయకుండా కొంచెం గట్టిగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. 

స్టెప్ 4: ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.

స్టెప్ 5: పూర్ణం కోసం.. ఒక గిన్నె తీసుకుని శుభ్రం చేసుకున్న శనగ పప్పును వేసుకుని బాగా కడగాలి. 

స్టెప్ 6: త‌రువాత‌ కొంచెం నీరు పోసి నానబెట్టుకోవాలి. 

స్టెప్ 7: ఒక గంట త‌రువాత‌ నానిన శన‌గ‌ పప్పును కుక్కర్‌లో వేసి ఐదు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. 

స్టెప్ 8: త‌రువాత‌ శనగ పప్పుని నీరు లేకుండా ఉడకట్టుకుని వేరే గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఆ శనగ పప్పుని పప్పు గుత్తెతో మెత్తగా మెదుపుకోవాలి. 

స్టెప్ 9: అందులో తగినంత బెల్లం వేసి, గ్యాస్ స్టౌ మీద పెట్టి, సిమ్‌లో వేడి చేస్తూ, బెల్లం కరిగి, ముద్ద అయ్యేవరకూ కలుపుతూ ఉండాలి. నీరు లేకుండా శనగపప్పు, బెల్లం మిశ్రమం గట్టి పడేవరకూ ఉడికించి కొంచెం నెయ్యి, యాలకుల పొడి వేసి స్టౌ మీద నుంచి దింపేసుకోవాలి. 

స్టెప్ 10: పూర్ణం చల్లారిన త‌రువాత‌ ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, అప్పుడు కావలిసిన సైజ్ లో ఉండలు చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బురెల తోపు కోసం రెడీ చేసుకున్న మినపప్పు, బియ్యం పిండిని తీసుకుని బాగా కలుపుకుని, కొంచెం వంట సోడా, ఉప్పు వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. 

స్టెప్ 11: ఇప్పుడు క‌ళాయి తీసుకుని స్టౌ మీద పెట్టి.. వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు శ‌నగ పిండి పూర్ణం ఉండలు ఒకొక్కటి తీసుకుని మినపప్పు తోపులో వేసి, ఉండగా తీసుకోవాలి.

స్టెప్ 12: వీటిని వేడెక్కిన నూనెలో వేసుకోవాలి. ఇలా కొన్ని వేసుకున్న త‌రువాత మీడియం మంటపై వేయించాలి. ఎర్రగా వేగిన త‌రువాత‌ ఒక టిష్యు పేపర్ వేసిన గిన్నెలోకి తీసుకోవాలి. 

అంతే రుచిక‌ర‌మైన‌ పూర్ణం బూరెలు రెడీ. వీటిని వేడివేడిగా తింటే, వారెవ్వా పూర్ణం ఏమి రుచి అని అనాల్సిందే. 

  • లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
Previous articleపండ‌గ‌ల సెలవులు.. ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాతర
Next articleTS-TET 2024: టెట్ అప్లికేష‌న్ల‌ గడువు పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఆఖ‌రి తేదీ ఎప్పుడంటే..!